
- రూ.4.5 కోట్లు గుంజిన అలిశెట్టి అరవింద్
- మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడిగా ప్రచారం
- బీఆర్ఎస్ ముఖ్యనేతలందరితో ఫొటోలు
- ప్రభుత్వ ఆఫీసులకు తీసుకెళ్లి ఆఫీసర్ల పరిచయం
- బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు : మిడ్ డే మీల్స్ ప్రాజెక్టుకు సరుకుల సప్లై కాంట్రాక్ట్ ఇప్పిస్తానని రూ.4.5 కోట్లు చీటింగ్ చేసిన బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ను సిటీ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఉన్న ఫొటోలను పరిశీలస్తున్నారు. ఈ మోసంలో ఎమ్మెల్యేలు, అధికారులకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బీఆర్ఎస్ ముఖ్యనేత ప్రధాన అనుచరుడు..!
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 73లో నివాసం ఉండే బొల్లినేని ధనుష్ శ్రీనివాస్(30) హైదరాబాద్, బెంగళూర్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. 2021 డిసెంబర్లో తన సోదరుడు కార్తీక్ ద్వారా అలిశెట్టి అరవింద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కాకతీయ హిల్స్కు చెందిన అరవింద్ తను బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా చెప్పుకున్నాడు. పార్టీ ముఖ్యనాయకుడు, మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడిగా పరిచయం చేసుకున్నాడు. పలు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను శ్రీనివాస్కు చూపించాడు. తనకున్న పరిచయాలతో పలుమార్లు ప్రభుత్వ ఆఫీసులకు తీసుకెళ్లాడు. మిడ్ మీల్స్కి చెందిన అధికారులను పరిచయం చేశాడు.
ఫోర్జరీ సంతకాలు, ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్లు..
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్లో అమలు చేస్తున్న ‘మిడ్ డే మీల్స్ స్కీమ్’ ప్రాజెక్ట్లో టెండర్ ఇప్పిస్తానని నమ్మించాడు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను సప్లయ్ చేసే బిజినెస్కు అనుమతులు ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో అనేక సార్లు శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. మంత్రులు, సంబంధిత అధికారులతో మీటింగ్స్ పెట్టిస్తానని నమ్మించాడు. మిడ్డే మీల్స్ స్కీమ్ ప్రాజెక్ట్కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు, అధికారుల ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన ఫేక్ జీవోలను చూపించాడు. 2022 ఫిబ్రవరి 16న రూ.50 లక్షలు వసూలు చేశాడు.
ఫేక్ జీవోలు చూపించి రూ.4.5 కోట్లు వసూలు
డ్రై రేషన్ సప్లయ్ చేసేందుకు అనుమతులు వచ్చినట్లు అరవింద్ నమ్మించాడు. ఈ క్రమంలో మరో రూ.4 కోట్లు వసూలు చేశాడు. ప్రముఖ నేతలు, అధికారుల అండదండలు ఉంటాయని చెప్పాడు. ఐతే రెండేండ్లు గడిచినా ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. దీంతో శ్రీనివాస్కు అరవింద్పై అనుమానం వచ్చింది. గచ్చిబౌలిలోని ఐటీసీ కొహినూర్లో మిడ్డే మీల్స్ ప్రాజెక్టు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరాడు. ఈ క్రమంలో అరవింద్ చీటింగ్ బయటపడింది. ప్రాజెక్ట్ రిపోర్ట్, పర్మిషన్స్, ఇతర డాక్యుమెంట్లను అరవింద్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. డిసెంబర్ 4న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరవింద్ను అరెస్ట్ చేశారు.