అక్రమంగా నిర్మిస్తున్నా..బనకచర్లపై బీజేపీ, కాంగ్రెస్ నోరెత్తడంలేదు: హరీష్ రావు

అక్రమంగా నిర్మిస్తున్నా..బనకచర్లపై బీజేపీ, కాంగ్రెస్ నోరెత్తడంలేదు: హరీష్ రావు
  • రాత్రికి రాత్రే ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటేఏం చేస్తున్నరు?
  • రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని మండిపాటు

దుబ్బాక, వెలుగు: గోదావరి నదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​పై రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం,  బీజేపీ ఎంపీలు, మంత్రులు నోరెత్తడం లేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. అపెక్స్​, తెలంగాణ ప్రభుత్వం, గోదావరి ట్రిబ్యునల్​ అనుమతి లేకుండా 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ సర్కారు రాత్రికి రాత్రే తరలించుకుపోతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నదన్నారు. 

రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న గోదావరి– బనకచర్ల ప్రాజెక్ట్​పై మీడియా ప్రశ్నిస్తే.. దానిపై స్డడీ చేయలేదని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సమాధానం ఇస్తారా? అని మండిపడ్డారు. 

అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లపై సుంప్రీకోర్టుకెళ్లే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్​ చేశారు. చంద్రబాబును ఎదిరించే దమ్ము, ధైర్యం మీకు లేదా అని కాంగ్రెస్​ నేతలను అడిగారు. 

ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలే

నీతి ఆయోగ్​ మీటింగ్​కు హాజరైన  సీఎం రేవంత్​రెడ్డి.. బనకచర్లపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని హరీశ్​రావు అన్నారు. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్​ పార్టీ తరఫున సుంప్రీంకోర్టుకెళ్లి బనకచర్లను ఆపుతామన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతుల్లేకుండా అడిషనల్​ ఎఫ్ఆర్బీఎం కింద రూ.40 వేల కోట్ల నిధులను ఏపీకి ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, లేదంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని, జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేపట్టాలని డిమాండ్​ చేశారు. మరోవైపు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే  తెలంగాణ బీజేపీ నేతలు పెదవులు విప్పకపోవడమేంటో అర్థంకావడం లేదన్నారు. బనకచర్లతో గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకపోతుంటే రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ మంత్రులకు పట్టవా అని ప్రశ్నించారు. 

ఉద్యోగులపై ప్రభుత్వం ఏసీబీ దాడులు చేయిస్తూ..  భయ బ్రాంతులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగులకు డీఏ ఇవ్వడానికి ముచ్చటగా 3 కమిటీలను వేసిందని, ఆ కమిటీలు 5 గంటలు ఉత్తిత్తి చర్చ చేశాయని అన్నారు. అబద్ధాలకు రేవంత్​ రెడ్డి బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరిస్తే.. రేవంత్​కు తాతలాగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తయారయ్యాయని ఎద్దేవా చేశారు.