
- అది బీఆర్ఎస్ ను బలహీన పర్చే వ్యూహం
- కొందరు వ్యక్తులు, పార్టీల కుట్రలు ఖండిస్తున్నం
- పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారు
- కేసీఆర్ సీఎంగా లేనందుకు జనం బాధపడుతుండ్రు
- తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటది
- శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతోందనేది కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్ఆర్ ను కేసీఆర్ ఎదుర్కొన్నారన్నారు. తెలంగాణను సాధించి, అభివృద్ధి చేసి చూపిన నేత కేసీఆర్ అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. జూన్ 2న తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. కేసీఆర్ ఆలోచనా విధానం తనకు తెలుసునని, పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని చెప్పారు. జూన్ 2వ తేదీన కాజలుశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని మధుసూదనాచారి చెప్పారు.