జనగామ/యాదాద్రి/రఘునాథపల్లి, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను యాదాద్రి, జనగామ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద అరెస్ట్ చేసి వలిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ గేట్ వద్ద మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను పోలీసులు అరెస్ట్చేసి రఘునాథపల్లి పీఎస్కు తరలించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రఘునాథపల్లి పీఎస్ ఎదుట రోడ్డుపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్చేయడం దారుణమన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృతుడు శంకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు.

