హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ స్పీకర్ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు.
స్పీకర్ తమకు సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని, అయితే, ఆయన ఆ సమయంలో ఇంట్లో లేరని కౌశిక్ రెడ్డి తెలిపారు. స్పీకర్ కోసం సుమారు రెండున్నర గంటలు వెయిట్ చేశామని చెప్పారు. ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే ఆయన తమను కలవలేదని ఆరోపించారు. స్పీకర్ను కలిసేందుకు సోమవారం మరోసారి ప్రయత్నిస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు.
