కేటీఆర్​ను కలిసేందుకు.. దుబాయ్​కి బీఆర్‌‌‌‌‌‌ఎస్ లీడర్లు

కేటీఆర్​ను కలిసేందుకు..  దుబాయ్​కి బీఆర్‌‌‌‌‌‌ఎస్ లీడర్లు

టికెట్ కోసం అక్కడే కలవడం మంచిదనే ఆలోచనలో నేతలు
6 న హైదరాబాద్​కు తిరిగి రానున్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు మంత్రి కేటీఆర్​ను కలిసేందుకు దుబాయ్ బాట పడుతున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు తన కొడుకును డిగ్రీలో జాయిన్ చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ అమెరికా వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన శనివారం హైదరాబాద్​కు తిరిగి రావాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఆలస్యమైంది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న హైదరాబాద్‌కు వస్తారు.  రిటర్న్ జర్నీలో 12 గంటలు దుబాయ్​లో బ్రేక్ ఉంది. ఆ టైమ్​లో గల్ఫ్ దేశాలకు చెందిన బీఆర్ఎస్​ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు, పలువురు ఇండస్ట్రియలిస్ట్​లను కేటీఆర్ కలవనున్నారు. అదే సమయంలో ఆయనను కలిసి టికెట్ గురించి తేల్చుకోవాలనే ప్రయత్నాల్లో ఆయన సన్నిహిత నాయకులున్నారు. అందుకు శని, ఆదివారాల్లో దుబాయ్​ వెళ్లేందుకు రెడీ అయ్యారు. 

ఇక్కడికొచ్చాక కేటీఆర్ టైం ఇవ్వరని... 

జనగామ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల్ టికెట్ కోసం బొంతు రామ్మోహన్, పఠాన్ చెరు టికెట్ కోసం నీలం మధు ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇంకో ఐదారుగురు లీడర్లు కూడా దుబాయ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ హైదరాబాద్​కు వచ్చిన తర్వాత ఎక్కువగా టైం ఇవ్వలేరని, తమ గోడు చెప్పుకొని టికెట్ పై హామీ దక్కించుకునేందుకు దుబాయ్​కి వెళ్లడమే మంచిదనే యోచనలో లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది.