బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు నేతన్నల షాక్‌

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు నేతన్నల షాక్‌
  •    పెండింగ్‌‌‌‌ పెట్టింది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారే అని నేతన్నల ఆగ్రహం
  •     ధర్నాకు తాము హాజరుకావడం లేదంటూ కార్మికుల ప్రకటన
  •     రాజకీయ లబ్ధి కోసం నేతన్నలను వాడుకోవద్దని హితవు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లకు సిరిసిల్ల నేతన్నలు గట్టి షాక్‌‌‌‌ ఇచ్చారు. నేతన్నలకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఈ నెల 15న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చేపట్టిన ధర్నాకు తాము హాజరుకాబోమని తేల్చి చెప్పారు. ఆర్డర్లు ఇచ్చింది, బకాయిలు పెట్టింది బీఆర్‌‌‌‌ఎస్సేనని, అదే పార్టీ ఇప్పుడు ధర్నా అంటూ నేతన్నలను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో సిరిసిల్ల నేతన్నలను మభ్యపెట్టేందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నిర్వహించే ధర్నాకు తాము హాజరుకావడం లేదని కార్మికులు స్పష్టం చేశారు.

ధర్నాకు పిలుపునిచ్చిన కేటీఆర్‌‌‌‌, వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌

బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి సిరిసిల్ల నేతన్నలకు రూ. 200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ డబ్బులను కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌, కరీనంగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ బోయిన్‌‌‌‌పల్లి వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు కొంతకాలంగా సిరిసిల్లలో ప్రెస్‌‌‌‌మీట్లు పెడుతూ నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాలుగు రోజుల కిందట సిరిసిల్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయిన్‌‌‌‌పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14 వరకు బతుకమ్మ చీరల బకాయిలు రిలీజ్‌‌‌‌ చేయాలని, లేకపోతే 15 నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతామని ప్రకటించారు. ఈ మహాధర్నాకు నేతన్నలు భారీ సంఖ్యలో హాజరై సక్సెస్‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు.

బెడిసికొట్టిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వ్యూహం

పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు రీలీజ్‌‌‌‌ చేయకుండా నేతన్నలకు కోట్లలో అప్పులు మిగిల్చిన పాపం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌దేనని నేతన్నలు మండిపడుతున్నారు. వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాములు దామోదర్‌‌‌‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ ధర్నా పేరిట బోయిన్‌‌‌‌పల్లి వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. నేతన్నలకు రాజకీయ రంగు పులుమొద్దని సూచించారు.

రూ.200 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆపేసింది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారేనని గుర్తు చేశారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బకాయిలను రిలీజ్‌‌‌‌ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ను కోరామని చెప్పారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ను కలిసి బకాయిలను విడుదల చేయించాలని కోరారని, ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం నేతన్నలను వాడుకోవద్దని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిర్వహించే ధర్నాకు తాము హాజరుకావడం లేదని ప్రకటించారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలోనే బకాయిలు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో 2017 నుంచి సిరిసిల్ల  నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్స్‌‌‌‌ ఇస్తున్నారు. కానీ చీరల ఉత్పత్తి అనంతరం బకాయిలను మాత్రం గత ప్రభుత్వం రిలీజ్‌‌‌‌ చేయలేదు. దీంతో గత రెండేళ్లకు సంబంధించి సుమారు రూ. 200 కోట్లు పెండింగ్‌‌‌‌లో పడ్డాయి. బకాయిలను రిలీజ్‌‌‌‌ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్‌‌‌‌ ప్రకటించినా ఆ హామీ నెరవేరలేదు. అలాగే యారన్‌‌‌‌ సబ్సిడీకి సంబంధించిన బకాయిలు సైతం పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. దీంతో నేత కార్మికులు నారాజ్‌‌‌‌లో ఉన్నారు.

గత సర్కారే నేతన్నలను నిండా ముంచి, ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని నేత కార్మికులు అంటున్నారు. నేతన్నలకు రూ. 3,500 కోట్లు ఇచ్చామని బోనయినపల్లి వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ చెబుతున్నారని, కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఆర్డర్‌‌‌‌లో 60 శాతానికి పైగా దారం కొనుగోలుకే వెచ్చించాల్సి వచ్చిందని, ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులన్నీ మీద పడ్డాయని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బకాయిలు ఇవ్వకపోవడంతో అప్పులపాలైనం 

బతుకమ్మ చీరల ఆర్డర్‌‌‌‌ ఇచ్చి ఆదుకోవడం మాట ఏమోగానీ, బకాయిలు పేరుకుపోవడం వల్ల అప్పులపాలైనం. సుమారు 200 కోట్ల పైచిలుకు బకాయిలు పేరుకుపోవడంతో మిత్తీలు మీదపడి నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. గత సర్కార్‌‌‌‌ ఆర్డర్ ఇచ్చి పని చేయించుకున్నారు, కానీ బకాయిలు రీలీజ్‌‌‌‌ చేయలేదు. సమస్యను కాంగ్రెస్‌‌‌‌ లీడర్ల దృష్టికి తీసుకెళ్లాం. బకాయిలు ఇస్తారన్న నమ్మకం ఉంది. 

- మండల సత్యం, పాలిస్టర్‌‌‌‌ వస్త్ర వ్యాపార సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు

రాజకీయ లబ్ధి కోసమే మహాధర్నా  

వచ్చే పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మహాధర్నాకు పిలుపునిస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది వారే కదా. ఆర్డర్లు ఇచ్చి బకాయిలు ఎందుకు పెండింగ్‌‌‌‌లో పెట్టారు ? నేతన్నలను ఎందుకు అప్పుల పాలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాల పేరుతో నేతన్నలను వాడుకోవడం సరికాదు. మేం ఎలాంటి ధర్నాలో పాల్గొనం. నేతన్నలపై బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రాజకీయాలు మానుకోవాలి.
- తాటిపాములు దామోదర్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల