సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ సెగ్మెంట్ తెలంగాణవాదానికి ఆది నుంచే కేంద్రంగా నిలిచిందని, ప్రజలు ఎమ్మెల్యేగా తనకు హ్యట్రిక్ విజయం అందించబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం సీతాఫల్మండీలో స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి సవరాల బస్తీ, శ్రీనివాస్ నగర్, స్కందగిరి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పదేళ్లుగా సికింద్రాబాద్ ప్రజలకు నిరంతరం సేవలు అందించానని, తన సేవలను ప్రజలు మరిచిపోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ క్రైస్తవ సంఘాల నేతలు, పాస్టర్ల సమావేశం ఆదివారం రాత్రి సీతాఫల్ మండీలో జరిగింది. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని పద్మారావు గౌడ్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.