జీబీ లింక్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం : హరీశ్ రావు

జీబీ లింక్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం : హరీశ్ రావు
  • ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టును చేపడుతున్నది: హరీశ్​ రావు
  • వెంటనే అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ పెట్టాలని కేంద్రాన్ని రిక్వెస్ట్​ చేయండి
  • మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్టుతో గోదావరి జలాల్లో రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టును చేపడితే గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతి.. ఆ తర్వాత అపెక్స్​ కౌన్సిల్ పర్మిషన్​ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ, ఏపీ మాత్రం ఇటు తెలంగాణకుగానీ, అటు బోర్డులకుగానీ సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా జీబీ లింక్​ను చేపడుతున్నదని చెప్పారు. 

త్వరలోనే ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకూ సిద్ధమవుతున్నదని అన్నారు.  ఏపీని అడ్డుకునేందుకు వెంటనే అపెక్స్​ కౌన్సిల్​ సమావేశాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర జలశక్తిశాఖకు విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హరీశ్​రావు ఆదివారం  ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి లేఖ రాశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమని, బేషజాలకు పోకుండా త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

 లేకుంటే అసెంబ్లీ స్పెషల్​ సెషన్​ను ఏర్పాటు చేసి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీపీఆర్​ సమర్పించాలంటూ ఏపీని కేంద్రం అడగడాన్ని వ్యతిరేకించడంతోపాటు జీబీ లింక్​ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి మీరు (ఉత్తమ్​)  లేఖ రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు గోదావరి ట్రిబ్యునల్​ అవార్డు వీలు కల్పించిందని హరీశ్​రావు గుర్తు చేశారు. అందులో మహారాష్ట్రకు 14 టీఎంసీలు, కర్నాటకకు 21 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలను బేసిన్​లోని ఆయకట్టుకు తరలించే వెసులుబాటు ఉందన్నారు.

 అయితే, సాగర్​ ఎగువన ఉండే రాష్ట్రం ఏపీ కోటా అయిన 45 టీఎంసీలను వాడుకునేందుకు ట్రిబ్యునల్​ అవార్డు వీలు కల్పించిందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ ఉన్నది కాబట్టి.. ఆ 45 టీఎంసీలు మన రాష్ట్రానికే చెందుతాయని చెప్పారు.  ఏపీ 200 టీఎంసీలు తరలించుకుపోతున్న నేపథ్యంలో.. తెలంగాణకు అదనంగా 112.5 టీఎంసీలు లభిస్తాయని, వాటికి 45 టీఎంసీలను కలిపితే.. 157.5 టీఎంసీలు మన రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. 

ఆ జలాలను ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు –రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల్లో వేటికైనా కేటాయించుకోవచ్చని చెప్పారు.  గోదావరి జలాల తరలింపునకు బదులుగా.. కృష్ణా నికర జలాల్లో 157.5 టీఎంసీలను తరలించుకునేలా కృష్ణా ట్రిబ్యునల్​ ముందు వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్​రావు కోరారు.