
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ రెండూ ద్రోహం చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. బుధవారం బీజేపీకి చెందిన పలువురు మహిళా నేతలు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ‘‘మొహబ్బత్ కీ దుకాణ్ అని రాహుల్ గాంధీ అంటారు.
మొహబ్బత్కీ దుకాణ్ అంటే హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలగొట్టుడా? మరి పెద్దోళ్ల ఇండ్లు ఎందుకు కూల్చట్లేదు? కాంగ్రెస్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు నీళ్లలోనే ఉన్నాయి కదా? ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు. మరి వాళ్ల ఇండ్లు ఎందుకు కూల్చట్లేదు? రాహుల్ బిహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే.. ఎందుకు మాట్లాడట్లేదు?” అని ప్రశ్నించారు. ‘‘సబ్ కా సాత్ సబ్కా వికాస్ అని ప్రధాని మోదీ అంటారు. కానీ ఆయన తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి రూ.100 కోట్లిచ్చి, రాష్ట్రానికి మాత్రం సున్నా ఇచ్చారు. ” అని మండిపడ్డారు.