
- ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా అబద్ధాలు చెప్తున్నరు: హరీశ్
- విద్యుత్ మీటర్లపై తప్పుడు పత్రం చూపించారు
- ఉదయ్ స్కీం ఒప్పందం చదివి.. వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారు
- సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో పాలక పక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సభా నాయకుడు ఇత ర స భ్యుల కు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. స భ లో అసత్యాలు మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో హ రీశ్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చారని, ఆ రిపోర్టును కేసీఆర్ పట్టించుకోలేదని గత సమావేశాల్లో రేవంత్ అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన ఒకలా ఉంటే.. సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పుదోవ పట్టించారు. ఈ అంశంపై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాము. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తాం” అని హరీశ్ రావు తెలిపారు.
పదవుల కోసం పెదవులు మూసుకున్నరు
‘‘పోతిరెడ్డిపాడుపై వైఎస్ హయాంలో మేము పదవుల కోసం నోరు మూసుకున్నాం అని రేవంత్ మాపై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డిపాడుపై జీవో రాకముందే మేము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగాం. మేము రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణం. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చింది. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబు తోనే ఉండే వారు. రేవంత్ తెలంగాణ ఉద్యమకారుల పై దాడికి రైఫిల్ తో బయలు దేరి, రైఫిల్ రెడ్డి అయ్యారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే, కేసీఆర్ పుణ్యమే. రేవంత్ చెబుతున్నట్టు జైపాల్ రెడ్డి తెలంగాణ వాది కాదు. ఆయన కనీసం ఒక్క పార్టీనైనా తెలంగాణ కోసం ఒప్పించలేదు. జైపాల్ రెడ్డిని ఈ రోజు రేవంత్ పొగుడుతున్నారు. కానీ, జైపాల్ రెడ్డి బతికున్నంత కాలం రేవంత్ రెడ్డిని దగ్గరికి కూడా రానివ్వలేదు”అని హ రీశ్ రావు దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది..
‘‘కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ఫీజులు లేకుండా చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు.. ఇప్పుడేమో ఎల్ఆర్ ఎస్ ఫీజులను రూ.14 వేల నుంచి 18 వేలకు పెంచి వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రుణ మాఫీపై రేవంత్ ది గోబెల్స్ ప్రచారం. రూ.31 వేల కో ట్లు రుణ మాఫీకి అవుతుందని చెప్పి చివ ర కు రూ. 25 వేల కోట్లే బడ్జెట్ లో పెట్టారు”అని హరీశ్ అన్నారు. ‘‘కాంగ్రెస్ కు గతంలో దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా, ఆ పార్టి పని అయిపోయిందా? బీఆర్ ఎస్ కూడా మళ్లీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని రేవంత్ దోచుకున్నాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు... కాంగ్రెస్ లో రేవంత్ చేరాడు”అని విమర్శించారు.