న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు అర్థనగ్నంగా నిరసన చేయడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (ఫిబ్రవరి 22) మీరట్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గ్లోబల్ ఈవెంట్ను కాంగ్రెస్ నీచ రాజకీయాలకు వాడుకుందని మండిపడ్డారు. ప్రపంచ వేదికను కాంగ్రెస్ పార్టీ మురికి, నగ్న రాజకీయాల వేదికగా మార్చిందని నిప్పులు చెరిగారు.
అంతర్జాతీయ ప్రతినిధులు హాజరైన గ్లోబల్ ఈవెంట్లో కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన చేయడం దేశానికి ఇబ్బందికరంగా మారిందన్నారు. కాంగ్రెస్ నేతలు నగ్నంగా ఉన్నారని దేశ ప్రజలకు ఇప్పటికే తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు సొంత దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేయడానికి బదులుగా భారతదేశాన్ని అవమానించిన వారిని ప్రశంసిస్తున్నారని మండిపడ్డారు.
ఇండియా కూటమి మిత్రపక్షాలు కాంగ్రెస్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయన్నారు. ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ నిరసనకు దూరంగా ఉన్నాయని తెలిపారు. పార్లమెంటును నిరంతరం అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని నిప్పులు చెరిగారు. తనను, తన కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే..?
దేశ రాజధానిలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం సమిట్లో ప్రముఖ కంపెనీల సీఈఓలు సాంకేతికతలో విప్లవాత్మక పురోగతి గురించి మాట్లాడుతుండగా.. పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు టీ షర్టులు తీసేసి అర్ధనగ్నంగా మోడీ, ట్రంప్ చిత్రాలు ఉన్న టీ షర్టులతో 5వ నంబర్ హాల్లోకి చొచ్చుకెళ్లారు.
అనంతరం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమిట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసులు వచ్చి ఆందోళనకారులను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. వారిలో నలుగురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
