సీఎం రేవంత్​ను కలిసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్​ను కలిసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు
  • సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్​ రెడ్డి, గూడెం మహిపాల్​ రెడ్డి, మాణిక్​ రావు భేటీ
  • సెక్యూరిటీ తగ్గింపు, ప్రొటోకాల్​ సమస్యలపై చర్చ
  • నియోజకవర్గాల పనులను ఆపొద్దని కోరిన ఎమ్మెల్యేలు
  • పది రోజుల క్రితమే అపాయింట్​మెంట్​ కోసం రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు :  సీఎం రేవంత్​ రెడ్డిని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కలిశారు. కొత్త ప్రభాకర్​ రెడ్డి(దుబ్బాక), సునీతా లక్ష్మారెడ్డి(నర్సాపూర్​), మహిపాల్​ రెడ్డి(పటాన్​చెరు), మాణిక్​ రావు(జహీరాబాద్) మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. నలుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సడన్​గా సీఎం రేవంత్​ రెడ్డితో భేటీ కావడం చర్చకు దారి తీసింది. అయితే, తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

పది రోజుల కిందటే వారు సీఎం అపాయింట్​మెంట్​ అడిగినట్టు తెలుస్తున్నది. అయితే, సీఎం రేవంత్​దావోస్​ పర్యటన నేపథ్యంలో వారికి అపాయింట్​మెంట్​ దొరకలేదు. మంగళవారం సీఎంవో నుంచి సడన్​గా వారికి ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. సీఎంను ఇంటి వద్ద కలిసేందుకు అపాయింట్​మెంట్​ ఇచ్చినట్టు తెలిసింది. సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్​ రెడ్డి.. హరీశ్​ రావుకు చెప్పే రేవంత్​ను కలిసినట్టు సమాచారం. సీఎంతో భేటీనే కదా.. కలిసి రండి అని హరీశ్​ అన్నట్టు తెలిసింది. 

సెక్యూరిటీ తగ్గించినందుకే..

సీఎం రేవంత్​తో ఎమ్మెల్యేల భేటీకి ప్రధాన కారణం సెక్యూరిటీని కుదించడమేనని తెలిసింది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డిని ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్​ రెడ్డితో పాటు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలందరికీ అప్పటి కేసీఆర్​ సర్కార్​ భద్రతను 4+4కు పెంచింది. మామూలుగా అయితే ఎమ్మెల్యేలకు 2+2 సెక్యూరిటీ ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ప్రభాకర్​ రెడ్డికి కూడా అందరిలాగానే 2+2కి సెక్యూరిటీని తగ్గించారు. తనపై ఇప్పటికే దాడి జరిగిందని, మళ్లీ దాడి చేసే ముప్పు ఎక్కువని సీఎం రేవంత్​కు కొత్త ప్రభాకర్​ రెడ్డి వివరించినట్టు తెలిసింది. సెక్యూరిటీని 4+4కి పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. 

ప్రొటోకాల్ ​పాటించడం లేదని..

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రొటోకాల్​ను​పాటించడం లేదని నలుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రొటోకాల్​ను ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం.  సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టులనూ కొనసాగించాలని వారు సీఎం రేవంత్​ను విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

ఇంటెలిజెన్స్​ చీఫ్​ను కలిసిన ఎమ్మెల్యేలు

పటాన్​చెరు, వెలుగు :  పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్  ఎమ్మెల్యే  మాణిక్ రావు     మంగళవారం ఇంటెలిజెన్స్​ చీఫ్​ శివధర్​ రెడ్డిని కలిసి ప్రొటోకాల్​ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు.

ఎలాంటి పదవులు లేని నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని,  రాజ్యాంగం కల్పించిన ప్రొటోకాల్ హక్కును ఉల్లంఘిస్తే రాజకీయ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు  పోలీస్ ఎస్కార్ట్ తొలగిస్తున్నారని, వెంటనే ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.