
- సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు భేటీ
- సెక్యూరిటీ తగ్గింపు, ప్రొటోకాల్ సమస్యలపై చర్చ
- నియోజకవర్గాల పనులను ఆపొద్దని కోరిన ఎమ్మెల్యేలు
- పది రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి(దుబ్బాక), సునీతా లక్ష్మారెడ్డి(నర్సాపూర్), మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), మాణిక్ రావు(జహీరాబాద్) మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సడన్గా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చకు దారి తీసింది. అయితే, తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
పది రోజుల కిందటే వారు సీఎం అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తున్నది. అయితే, సీఎం రేవంత్దావోస్ పర్యటన నేపథ్యంలో వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. మంగళవారం సీఎంవో నుంచి సడన్గా వారికి ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. సీఎంను ఇంటి వద్ద కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి.. హరీశ్ రావుకు చెప్పే రేవంత్ను కలిసినట్టు సమాచారం. సీఎంతో భేటీనే కదా.. కలిసి రండి అని హరీశ్ అన్నట్టు తెలిసింది.
సెక్యూరిటీ తగ్గించినందుకే..
సీఎం రేవంత్తో ఎమ్మెల్యేల భేటీకి ప్రధాన కారణం సెక్యూరిటీని కుదించడమేనని తెలిసింది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ అప్పటి కేసీఆర్ సర్కార్ భద్రతను 4+4కు పెంచింది. మామూలుగా అయితే ఎమ్మెల్యేలకు 2+2 సెక్యూరిటీ ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా అందరిలాగానే 2+2కి సెక్యూరిటీని తగ్గించారు. తనపై ఇప్పటికే దాడి జరిగిందని, మళ్లీ దాడి చేసే ముప్పు ఎక్కువని సీఎం రేవంత్కు కొత్త ప్రభాకర్ రెడ్డి వివరించినట్టు తెలిసింది. సెక్యూరిటీని 4+4కి పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం.
ప్రొటోకాల్ పాటించడం లేదని..
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రొటోకాల్నుపాటించడం లేదని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రొటోకాల్ను ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులనూ కొనసాగించాలని వారు సీఎం రేవంత్ను విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
ఇంటెలిజెన్స్ చీఫ్ను కలిసిన ఎమ్మెల్యేలు
పటాన్చెరు, వెలుగు : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మంగళవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు.
ఎలాంటి పదవులు లేని నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, రాజ్యాంగం కల్పించిన ప్రొటోకాల్ హక్కును ఉల్లంఘిస్తే రాజకీయ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు పోలీస్ ఎస్కార్ట్ తొలగిస్తున్నారని, వెంటనే ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.