తెలంగాణలో క్రమంగా పడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్

 తెలంగాణలో క్రమంగా పడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్

హైదరాబాద్, వెలుగు: పదేండ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పి, వివిధ ఎన్నికల్లో సత్తాచాటుతూ వచ్చిన బీఆర్ఎస్..​ క్రమంగా తన ఓటుబ్యాంకును కోల్పోతున్నది. 2018  అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023లో ఆ పార్టీ ఓట్ షేర్ సుమారు 9శాతం తగ్గింది. 2019 పార్లమెంట్​ఎన్నికలతో పోలిస్తే 2024లో ఏకంగా 25శాతం ఓట్లను కోల్పోయింది. బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  46.87శాతం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41.29 శాతం,  2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.62 శాతం, 2024 పార్లమెంట్​ఎన్నికల్లో16.68 శాతం ఓట్లు సాధించింది. ఇక జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 43.94 శాతం ఓట్లు సాధించగా, ఇప్పుడు బైపోల్‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీ ఓటు షేర్ 38.13 శాతానికి పడిపోయింది. 

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో జోరు..

2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తాజా ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్​ఓట్​షేర్ 15శాతానికి పైగా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,83, 312 ఓట్లు పోల్​కాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్​ 80,549 ఓట్లు అంటే 43.94% ఓట్​షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్​64,212 ఓట్లతో 35.03% ఓట్​షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. వీరి మధ్య కేవలం 8.91 శాతం ఓట్ల తేడా ఉంది. 

కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో సీన్​రివర్స్ అయింది. ఈసారి పోలైన 1,94,727 ఓట్లలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్​ 98,988 ఓట్లతో ఏకంగా 50.83% ఓట్​షేర్​సాధించారు. అంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు గత ఎన్నికల కంటే 15.80%​ ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో బీఆర్ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో 38.13% ఓట్​షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. అంటే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 5.81% ఓట్లు తగ్గాయి. అలాగే ఈ బైపోల్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్​మధ్య ఓట్ల తేడా 12.4 శాతం ఉంది.