
- పార్టీ ఏదైనా సరే కాల్ రికార్డు చేసిండ్రు
- మంత్రి పొంగులేటికి సిట్ నుంచి కాల్
- విచారణకు రావాలని పిలిచిన ఆఫీసర్లు
- బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికీ నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. ఎవరిపై అనుమానం ఉంది..వాళ్లు ఎటు వెళ్తున్నారు.. ఏమేం చేస్తున్నారు..? తెలుసుకోండి..! పక్కాగా రిపోర్ట్ రావాలె.. మొబైల్ సంభాషణలే టార్గెట్ చేసుకొని 2023 ఎన్నికల్లో గెలుపునకు బీఆర్ఎస్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పక్క పార్టీలో చేరతారనే అనుమానం ఉన్న నాయకులపైనే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులతో పాటు వారితో సన్నిహితంగా ఉండే వారందరి ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు కు ఎస్వీటీ చీఫ్ బాధ్యతలు అప్పగించి పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు సమాచారం. దీంతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్ సంభాషణలు సైతం ట్యాప్ అయ్యాయి. ఈ మేరకు ఇవాళ సిట్ అధికారులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, విచారణకు రావాలని కోరారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వీడిన మరో నేత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన 2019 ఎన్నికల సమయంలో గడ్డం రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బీజేపీలో చేరి చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ALSO READ | అందుకే నా ఫోన్ ట్యాప్ చేశారు..కేసీఆర్పై క్రిమినల్ కేసు పెట్టాలి
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ జరిగింది. ఈ మేరకు సిట్ నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యింది. ఆయన పాదయాత్ర, రూట్ మ్యాప్, గ్రూప్–1 లీకేజీపై ఆయన చేసిన పోరాటం, టెన్త్ క్లాస్ క్వశ్చన పేపర్ లీకేజీ పై పోరాటం ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఆయన కూడా వచ్చి వాంగ్మూళం ఇవ్వాలని సిట్ కోరింది.
స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోసం తాటికొండ రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చారు. ఆ తర్వాత రాజయ్య కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన కదలికలను గమనించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఫోన్ సంభాషణలు, కదలికల ఆధారంగా ఆయనను పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన పద్మాదేవేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. అప్పట్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు తనతోపాటు తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ అడిగారు. బీఆర్ఎస్ నాయకత్వంపై ఒత్తిడి పెట్టారు. దీనికి నిరాకరించడంతో ఆయన పార్టీ మారి కాంగ్రెస్ జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలో ఆయన కదలికలను గమనించేందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి కార్యక్రమాలను విస్తృతం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. ఏది ఏమైనా 2023 ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలనూ గత ప్రభుత్వం చేసినట్టు తెలుస్తోంది.
సంభాషణలు వినిపిస్తున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ జరిగిన వారిని విచారణకు పిలిచి.. వాళ్లు మాట్లాడిన సంభాషణలను వినిపిస్తూ స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన 618 మంది నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సిట్ కు తమ వాంగ్మూళం ఇచ్చారు. మరికొందరి నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు