
ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినందుకే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఅర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అమర్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ను సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పటాన్ చెరులో కేసీఆర్ తన పరిశ్రమను బంద్ చెయించినా వెనక్కి తగ్గలేదని చెప్పారు మంత్రి వివేక్. తెలంగాణ లో 119 నియోజకవర్గాల్లో గెలిచిన వారందరు రాజులేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ నోటీసులు ఇస్తే విచారణకు హజరయ్యానని.. ట్యాపింగ్ పై విచారణకు పిలిస్తే విచారణకు హజరవుతానని చెప్పారు మంత్రి వివేక్.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. 4013 ఫోన్ నంబర్లను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ బాధితులు 618 మంది ఉండగా.. ఇందులో పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు.
618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.