
- పాలనా భవనమా..పార్టీ ఆఫీసా?
- బీఆర్ఎస్ సొంత ప్రోగ్రామ్లా సెక్రటేరియెట్ ఓపెనింగ్
- ప్రజల గొంతును వినిపించే వీ6, వెలుగు మీడియాకు నో ఎంట్రీ
- నచ్చిన, మెచ్చిన మీడియాకు మాత్రం స్పెషల్ పర్మిషన్
- దేశవ్యాప్తంగా పత్రికలకు కోట్లాది రూపాయలతో యాడ్స్
- ఇతర రాష్ట్రాల జర్నలిస్టులను సెలెక్ట్ చేసి ఆహ్వానాలు
- ప్రభుత్వ కార్యక్రమంలో కేసీఆర్ సర్కారు వివక్ష
హైదరాబాద్, వెలుగు: పాత సెక్రటేరియెట్ను కూల్చేసి రూ. 1,600 కోట్ల ప్రజల సొమ్ముతో కట్టిన కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ను రాష్ట్ర సర్కారు బీఆర్ఎస్ పార్టీ సొంత ప్రోగ్రామ్లా నిర్వహించింది. నచ్చిన మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రజల గొంతును వినిపించే వీ6, వెలుగు వంటి తెలంగాణ మీడియా సంస్థలపై మాత్రం అడుగడుగునా ఆంక్షలు పెట్టి.. పరిపాలనా భవనాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల పత్రికలకు, హిందీ, ఇంగ్లిష్పత్రికలకు, మీడియా చానెళ్లకు కోట్లాది రూపాయల యాడ్స్ ఇచ్చి.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. వేరే రాష్ట్రాల నుంచి ఏరి కోరి కొందరు మీడియా ప్రతినిధులను విమానాల్లో తీసుకొచ్చింది. బీఆర్ఎస్ మీటింగ్లకు వీ6, వెలుగును అనుమతించొద్దంటూ మొన్నామధ్య పార్టీ లీడర్లకు కేటీఆర్ ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్లోనూ రాష్ట్ర సర్కారు ఆంక్షలకు దిగడం చర్చనీయాంశమైంది.
సమైక్య పాలకులను మించి..!
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న సెక్రటేరియెట్సాక్షిగా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షను చూపింది. రాష్ట్ర పరిపాలన కేంద్రం ఓపెనింగ్ తొలిరోజే అచ్చ తెలంగాణ మీడియాపై ఆంక్షల కత్తి దూసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, ఉద్యమకారులకు వెన్నుదన్నుగా నిలిచిన వీ6 మీడియా గొంతును అణగదొక్కేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కుయుక్తులు పన్నారు. ఆంక్షలు విధించారు. ఇప్పుడున్న ప్రభుత్వం అంతకు మించిన నిషేధాజ్ఞలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అమలు చేస్తున్నది.
రాష్ట్ర పరిపాలన భవనమైన సెక్రటేరియెట్ ఓపెనింగ్కు వీ6, వెలుగు మీడియా సంస్థతోపాటు మరికొన్ని మీడియా సంస్థలను కూడా రానివ్వలేదు. ఈ నిషేధాజ్ఞలు ప్రగతిభవన్ నుంచే జారీ అయ్యాయి. సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కవరేజీకి ఇచ్చే మీడియా పాస్లను వీ6, వెలుగుకు ఆపేశారు. ధర్నాలు, నిరసనలను అడ్డుకున్నట్లుగా ఎక్కడికక్కడ పోలీసు బలగాలను పెట్టి స్థానిక మీడియా ప్రతినిధులను నిలిపేశారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన సొంత మీడియాతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులను బీఆర్ఎస్ ముఖ్య నేతలు సెక్రటేరియెట్ఆరో ఫ్లోర్లోని కేసీఆర్చాంబర్వరకు తీసుకెళ్లి చూపించారు. బంజారాహిల్స్లోని ఒక ఫైవ్స్టార్హోటల్లో బస కల్పించారు.
అంతా అధికార పార్టీ లీడర్లే
రూ. 400 కోట్లతో ఎస్టిమేషన్ వేసి.. అంతకు నాలుగింతలు (రూ.1,600 కోట్లు) ఖర్చు పెట్టి నిర్మించిన సెక్రటేరియెట్ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలా చేశారు. అధికార పార్టీ నాయకులు మినహా ఇంకెవరూ ఆ పరిపర ప్రాంతాల్లో కనిపించలేదు.
ఇతర భాషల్లో ఫుల్ పేజీలు!
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పబ్లిసిటీ ఖర్చు పీక్ కు చేరింది. మొదటి ప్రభుత్వంలో తెలంగాణలో మాత్రమే ప్రచారానికి ఖర్చు చేయగా.. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లోని మీడియా, పత్రికలకు యాడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ న్యూస్ పేపర్లతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ ప్రాంతీయ భాషా పేపర్లలోనూ ఫుల్ పేజీల అడ్వర్టయిజ్ మెంట్లు ఇస్తున్నారు. తొమ్మిదేండ్లలో ప్రచారం కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్సర్కారు.. ఒక్క 2023 – - 24 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ ప్రచారం కోసం రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ప్రవేశపెట్టింది. ఇందులో 30 శాతం మాత్రమే తెలంగాణలో ఖర్చు చేసి.. మిగతా 70 శాతం నేషనల్మీడియాతో పాటు ఇతర భాషల మీడియాలో ప్రచారం కోసం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే సెక్రటేరియెట్ఓపెనింగ్ రోజు తెలంగాణ మీడియాపై వివక్ష చూపిన ప్రభుత్వం.. నేషనల్ మీడియాతో పాటు ఇతర ప్రాంతీయ భాషల మీడియాకే కవరేజీతో పాటు అడ్వర్టయిజ్మెంట్లలోనూ ప్రాధాన్యం ఇచ్చింది.
సెక్రటేరియెట్ ఓపెనింగ్ పేరుతో దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలకు, మీడియా చానెళ్లకు భారీ ఎత్తున ప్రజల సొమ్ముతో అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చారు. ఇట్లా ఓపెనింగ్ యాడ్స్ కోసమే సుమారు రూ.80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇతర రాష్ట్రాల మీడియా ప్రతినిధులకు విమాన టికెట్లు, బస, ఇతర ఖర్చులన్నీ ప్రభుత్వమే
ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లిస్తున్నది. ఇలా మొత్తంగా ప్రచార ఆర్భాటం కోసమే రూ. వంద కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. తన పార్టీ ప్రచారానికి ఇతర రాష్ట్రాల్లో మీడియా యాడ్స్ కోసం ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే రూ.30 కోట్లకు పైగా వెచ్చించారు. ఏడాది వ్యవధిలోనే ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల్లో రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. రాష్ట్ర సమాచార ప్రసార శాఖ బడ్జెట్ను రూ.140 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు ప్రభుత్వం పెంచింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ప్రచారం కోసమే ఇలా బడ్జెట్ను పెంచినట్లు తెలుస్తున్నది.
అప్పుడు ఖండించిన కేసీఆరే.. ఇప్పుడు..
స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున ముందుండి.. సమైక్యాంధ్ర పాలకులను ప్రశ్నిస్తూ వచ్చింది వీ6 మీడియా. దీనిపై ఆగ్రహించిన అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి వీ6 మీడియాను సెక్రటేరియెట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులందరితో పాటు కేసీఆర్ కూడా ఖండించారు. అట్ల ఖండించిన కేసీఆర్.. ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రజా సమస్యలను బయటపెడ్తున్న వీ6, వెలుగుపై ఆంక్షలకు దిగారు. ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచే ఆదేశాలు ఇచ్చి సెక్రటేరియెట్ ఓపెనింగ్ కవరేజీకి వీ6, వెలుగు మీడియా ప్రతినిధులను రాకుండా అడ్డుకున్నారు.