బీఎస్పీ.. బీఆర్ఎస్​ పొత్తు ఖరారు : ఆర్ఎస్​ ప్రవీణ్​

బీఎస్పీ.. బీఆర్ఎస్​ పొత్తు ఖరారు : ఆర్ఎస్​ ప్రవీణ్​
  •      పార్లమెంట్ ఎన్నికల్లో  ఉమ్మడిగా పోటీ చేస్తాం 

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అనుమతి లభించిందని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్​ తెలిపారు.   పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కలిసి పోటీచేస్తాయని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే, ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ హై కమాండ్ అనుమతించిందని తెలిపారు. 

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి కలిసి పోటీచేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బెహన్జీ దూతగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.

 ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే సంయుక్తంగా మీడియాకు వెల్లడిస్తామన్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై   వస్తున్న నిరాధారమైన వార్తలు, వదంతులు, దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని ప్రవీణ్​ కుమార్​కోరారు.