
- కామన్ ఏరియాలో అక్రమ నిర్మాణం
- నిర్వాసితులు కోర్టుకు వెళ్లారని వారిపై దాడి
మలక్ పేట, వెలుగు: అపార్ట్మెంటులో ఫ్లాట్లన్నీ అమ్మేసుకున్న ఓ బిల్డర్ కామన్ ఏరియాలో అక్రమ నిర్మాణం చేపట్టాడు. దీనిపై అపార్ట్మెంట్వాసులు కోర్టును ఆశ్రయించినందుకు సదరు బిల్డర్ తన గ్యాంగుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మలక్ పేట అస్మన్ ఘడ్ రాక్ చర్చి సమీపంలో మూడేళ్ల క్రితం డబీర్ పురాకు చెందిన మసియుద్దీన్ ఎలైట్ రెసీడెస్సీ పేరుతో ఐదంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించాడు. అందులోని 15 ఫ్లాట్లను అమ్మేశాడు.
ఇటీవల అందులోని కామన్ ఏరియాలో జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టాడు. అపార్ట్మెంట్ వాసులు దీనికి అభ్యంతరం చెబుతూ కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు అక్రమ నిర్మాణం కూల్చివేయాలని తీర్పునిచ్చింది. విషయం తెలుసుకున్న బిల్డర్ మసీయుద్దీన్ తన గ్యాంగ్తో అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి వచ్చి అపార్ట్ మెంట్ వాసి బ్రహ్మానందంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మహిళలను భయబ్రాంతులకు గురిచేశారు. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడికి ఎమ్మెల్యే పైడి పరామర్శ..
బిల్డర్ చేతిలో గాయపడి సైదాబాద్ సాయి నర్సింగ్ హోం హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మరోవైపు దాడి విషయంలో మలక్ పేట్ సీఐ నరేశ్, ఎస్ఐ నవీన్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఏసీపీ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు.