- సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రమాదం
న్యాల్కల్, వెలుగు: కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొట్టిన అనంతరం బోల్తా పడడంతో ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంశల్లాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ, కర్నాటక సరిహద్దులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సు ప్రయాణికులతో మంగళవారం బీదర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తోంది. న్యాల్కల్ మండలం బంగ్లా మీర్జాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ (22), నర్సింలు (50)లు బీదర్లో జరిగే బంధువుల వివాహానికి బైక్పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో శంశాల్లాపూర్ గ్రామ శివారులోకి చేరుకోగానే... బస్సు బైక్ను ఢీకొట్టిన అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డ అరుణ్, నర్సింలు అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని బీదర్లోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
