మదనాపురం,వెలుగు: ప్రతి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, హైవేపై ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చెప్పారు. వనపర్తి జిల్లా మదనాపురంలో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చైర్మన్ పల్లెపోగు ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించడం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందన్నారు. దేవరకద్రలో వంద పడకల హాస్పిటల్కు రూ. 35 కోట్లు కేటాయించి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని, కొత్తకోటకు కూడా 50 పడకల హాస్పిటల్ను మంజూరు చేస్తామన్నారు.
జాతీయ రహదారిపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అందులో అత్యవసర వైద్య సిబ్బందితో పాటు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో 134 రకాల వైద్య పరీక్షలు ఫ్రీగా చేస్తామని ప్రకటించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. అనంతరం కొన్నూరులో స్కూల్ బిల్డింగ్ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, తూడి మేఘారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, కలెక్టర్ ఆదర్శ్ సురభి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్ అబ్రహాం లింకన్ పాల్గొన్నారు.
