
- నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో యాక్షన్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనాన్ని మంగళవారం కంటోన్మెంట్ అధికారులు పూర్తిగా కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మాణాలు చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసిన కంటోన్మెంట్ అధికారులు.. స్పందించకపోవడంతో ఉదయాన్నే పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేయడంతో ఇంటి యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. గత 90 ఏండ్లుగా ఎరుకల సామాజిక వర్గమైన తాము ఇక్కడే నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్నామన్నారు. తమపై కక్ష కట్టి తమ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు.