హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను సమీపంలోని మునిసిపాలిటీల్లో కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో సీపీఎం ఎంపీ వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. కంటోన్మెంట్లను మునిసిపాలిటీల్లో కలిపేందుకు అవసరమైన విధివిధానాలతో కూడిన ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాలకు పంపించామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నామని, వారి రెస్పాన్స్ను బట్టి నిర్ణయం తీసుకుంటామ ని ఆయన వివరించారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ధర్మశాలలోని ఖాస్యోల్ కంటోన్మెంట్ను ఈ ఏడాది ఏప్రిల్ చివరలో డీనోటిఫై చేశామని మంత్రి వెల్లడించారు. కాగా, హైదరాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.