హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. దర్శకుడిగా, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు ధనుష్. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో పాటు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో మూవీ, ఇళయరాజా బయోపిక్లోనూ నటిస్తున్నాడు. అలాగే తన మైల్ స్టోన్ మూవీని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తన 50వ చిత్రాన్ని తనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు ధనుష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నాలుగు నెలల్లోనే మొత్తం షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి థ్యాంక్స్ చెబుతూ.. కళానిధి మారన్, సన్ పిక్చర్స్ సంస్థ తన విజన్కు ఎంతో సపోర్ట్ చేశారని ట్వీట్ చేశాడు.
ఆరేళ్ల గ్యాప్ తర్వాత ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నార్త్ మద్రాస్ బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ డ్రామా. ధనుష్ పవర్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడట. నిత్యామీనన్, అనిఖా సురేంద్రన్ హీరోయిన్స్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నిర్మాతగానూ వరుస చిత్రాలు నిర్మించేలా ధనుష్ ప్లాన్ చేస్తున్నాడు.