కారు బోల్తా…నలుగురు విద్యార్థులు మృతి

కారు బోల్తా…నలుగురు విద్యార్థులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారు. చనిపోయిన వారు హైద్రాబాద్ కొత్తపేట, మీర్ పేట కు చెందిన చైతన్య, మనీష్ రెడ్డి, వినీత్ రెడ్డి, ప్రణీత, స్పూర్తి గా గుర్తించారు. ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి శివారులో రాత్రి ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్  కాలేజ్ కు చెందిన 16 మంది విద్యార్థులు బొమ్మలరామారం మండల కేంద్రంలోని ఓ గెస్ట్ హౌస్ లో రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడే అంతా కలిసి మద్యం సేవించారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ , తాగిన మైకంలో… మూలమలుపు ఉండడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ప్రణీత, స్ఫూర్తి, చైతన్య అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో భువనగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్షతగాత్రులను  హైదరాబాద్ కు తరలించారు.