పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్), వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భినీ పీహెచ్ సీ గేట్ దగ్గరే ప్రసవించింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణీ భీమమ్మకు మంగలవారం సాయంత్రం నొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. దీంతో భర్త మల్లేశ్ తో కలిసి నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది.
అదే సమయంలో భీమమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి మెయిన్ డోర్ ముందరే ప్రసవించింది. ఆ సమయంలో ఆస్పత్రిలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ చెన్నయ్య ఒక్కడే డ్యూటీలో ఉన్నట్లు సమాచారం. ప్రసవానంతరం మండల కేంద్రంలో ఉన్న ఆర్ఎంపీని పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. తల్లి,శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.