ఆదిపురుష్‌‌పై సైఫ్ వివాదాస్పద కామెంట్స్.. కేసు నమోదు

ఆదిపురుష్‌‌పై సైఫ్ వివాదాస్పద కామెంట్స్.. కేసు నమోదు

జౌన్‌‌పూర్: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ మీద ఉత్తర్ ప్రదేశ్‌‌లోని జౌన్‌‌పూర్‌‌లో కేసు నమోదైంది. రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి నటించబోయే ఆదిపురుష్ మూవీలో లంకేశ్వరుడైన రావణుడిగా సైఫ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ పలు కామెంట్స్ చేశాడు. రావణుడిలోని ఉన్నతమైన మానవ లక్షణాలను తన పాత్రలో చూపించబోతున్నట్లు సైఫ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సనాతన ధర్మానికి, ప్రజల విశ్వాసాలకు విరుద్ధంగా సైఫ్ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషన్ వేసిన హిమాన్షు శ్రీవాత్సవ అనే సివిల్ కోర్టు అడ్వకేట్ తెలిపారు.

సదరు ఇంటర్వ్యూలో సైఫ్ కామెంట్స్ క్లుప్తంగా.. ‘రాక్షస రాజు పాత్రలో నటించనుండటం ఆసక్తిగా ఉంది. ఆ పాత్రలో నిబంధనలు తక్కవగా ఉంటాయి. కానీ ఆయనను మేం మానవత్వం కలిగిన మనిషిలా చూపించబోతున్నాం. ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ను పక్కనబెడితే.. రావణుడు సీతను ఎత్తుకెళ్లడాన్ని, రాముడి పై ఆయన యుద్ధం చేయడాన్ని.. తన సోదరి సూర్పనక ముక్కును లక్ష్మణుడు కోసినందుకు చేసిన ప్రతీకార చర్యగా చూపించబోతున్నాం’ అని అని సైఫ్ పేర్కొన్నాడు. ఈ కామెంట్స్‌‌పై ఆన్‌‌లైన్‌‌లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.