బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు

బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్ పై అత్యాచారం కేసు నమోదైంది. మనోజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతని కోడలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గతేడాది డిసెంబర్ 31 న తన భర్త, సోదరుడు, బంధువులతో కలసి పుట్టింటి నుంచి మీర్ బాగ్ లోని తన అత్తవారింటికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమె భర్త న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పశ్చిమ విహార్ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ జరిగిన తర్వాత రాత్రి 12:30 గంటల సమయంలో మీర్ బాగ్ లోని తమ ఇంటికి చేరుకున్నారు.

ఆమెను ఇంటి వద్ద దించిన భర్త.. తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునేందుకు తిరిగి బయటికెళ్లాడు. రాత్రి 1:30 సమయంలో ఆమె తన గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న వేళ అప్పటికే మద్యం సేవించిఉన్న తన భర్త తండ్రి మనోజ్ షోకీన్ తన గదిలోకి వచ్చి నన్ను తాకడంతో తను ప్రతిఘటించబోతే గన్ తో బెదిరించి తనపై అత్యాచారం చేశాడని.. తర్వాత ఈ విషయం పెడితే తన తమ్ముడిని, కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని ఆమె తన FIR లో పేర్కొంది. తన కాపురం కూలిపోతుందనే భయంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, అయితే గత కొంతకాలంగా మళ్లీ మనోజ్‌ ప్రవర్తనలో మార్పు రావడం, భర్త కూడా అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో అత్తవారింటిపై గృహహింస కేసు పెట్టినట్టు తెలిపింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మాజీ ఎమ్మెల్యే పై సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పూర్తిగా ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకుంటామని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ పి.కురువిల్లా తెలిపారు.