
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూ కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారంలో ఓరియల్ ఎస్టేట్ సంస్థ 100 కోట్ల విలువైన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేల్చారు రెవెన్యూ అధికారులు. నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు.
బాటసింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది. అయితే ప్రజా ప్రయోజనాల కోసం వదిలివేసిన లక్ష గజాల భూమిని శ్రీమిత్ర డెవలపర్స్ కాజేయాలని చూసింది. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
నకిలీ ప్రొసీడింగ్స్ అని తేల్చిన అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఓ బ్యాంకు ఉద్యోగి సహా పలువురు ఉన్నట్లు గుర్తించారు.