మాల మహానాడు, మాదిగ దండోరా కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి: బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి

మాల మహానాడు, మాదిగ దండోరా కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి: బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మాల మహానాడు, మాదిగ దండోరా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బంధు సొసైటీ డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. రిటైర్డ్ రైల్వే అధికారి అప్పికట్ల భరత్ భూషణ్, ప్రొఫెసర్ ముత్తయ్య, ప్రొఫెసర్ నథానియల్ హాజరై మాట్లాడారు.

30 ఏండ్ల  సుదీర్ఘ పోరాట సమయంలో వర్గీకరణకు మద్దతుగా, వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మాల, మాదిగ సంఘాల నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారని తెలిపారు. వర్గీకరణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. కేసులు ఉంటే ఉద్యోగాలు పొందలేరని, మానవతా దృష్టితో తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్యాక్​లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నరసింహరావు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.