- అనుచరులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు
సూర్యాపేట, వెలుగు : నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై కేసులు ఆగడం లేదు. తనపై పోలీసులు ఏకంగా12 కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ జానయ్య సుప్రీం కోర్ట్ కు వెళ్లగా, బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను కేసుల పేరుతో వేధిస్తున్నారని జానయ్య కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పోలీసులు మరో రెండు కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ లో మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా జానయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు పోస్టులు పెడ్తున్నారని సుధాకర్ అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ పీఎస్లో జానయ్య , ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. గాంధీనగర్ ల్యాండ్ ఇష్యూలో జానయ్య, ఆయన కుటుంబసభ్యులు తనను ఫోన్ లో బెదిరిస్తున్నారంటూ రామస్వామి శైలజ ఫిర్యాదుతో జానయ్యతో పాటు ఆయన కొడుకు, అక్క, అల్లుడిపైనా మరో కేసు నమోదు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన జానయ్య వర్గం బీఎస్పీలో చేరింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జానయ్యకు సూర్యాపేట నుంచి బీఎస్పీ టికెట్ ప్రకటించారు.
సూర్యాపేటలో బీఎస్పీ ఆఫీసు ప్రారంభానికి ప్రవీణ్కుమార్ రావడంతో ఆ సందర్భంగా తీసిన ర్యాలీలో 10వేల మందికిపైగా పాల్గొనడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. దీన్ని జీర్ణించుకోలేకే జానయ్యపై మరోసారి కేసులు పెడ్తున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జానయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టేందుకు యత్నించగా, పలువురిని అరెస్ట్ చేసి రెండు రోజుల తర్వాత రిలీజ్ చేశారు. జానయ్య ముఖ్య అనుచరుడిగా పేరున్న ఒకరిని ఇటీవలే పీఎస్కు పిలిపించి జానయ్యకు మద్దతిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.