- సర్కారు దవాఖాన్లలో సిబ్బంది, డాక్టర్లపై నిఘా.. ప్రభుత్వం నిర్ణయం
- ప్రైవేటుకు రిఫర్ చేస్తున్నరంటూ ఇటీవలి రివ్యూలో హరీశ్కు అధికారుల ఫిర్యాదు
- అన్ని దవాఖాన్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లను తప్పుదోవ పట్టించి ప్రైవేటు దవాఖాన్లకు రిఫర్ చేసే డాక్టర్లు, సిబ్బందిపై కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందిపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సూచించింది. ఆర్థోపెడిక్ ఆపరేషన్ కేసులు, డెలివరీ కేసులు ప్రభుత్వ దవాఖాన్ల నుంచి, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న ఘటనలను ఇటీవల జరిగిన ఓ రివ్యూలో మంత్రి హరీశ్కు అధికారులు వివరించారు. హాస్పిటల్ సిబ్బంది, కొంత మంది డాక్టర్లు కావాలని పేషెంట్లను ప్రైవేటుకు పంపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయిస్తామని కొందరిని, సర్కారు దవాఖాన్లలో చికిత్స బాగాలేదని భయపెట్టి తరలిస్తున్నట్టు వివరించారు. దీంతో హాస్పిటళ్లలోని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వారిపై నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. నిజామాబాద్ టీచింగ్ హాస్పిటల్లో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆపరేషన్కు ముందు రోజు పేషెంట్ను తరలించినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన అక్కడి సూపరింటెండెంట్, నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై అన్ని హాస్పిటళ్లలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, పేషెంట్ వచ్చిన వెంటనే అతని వివరాలను ఆరోగ్యశ్రీలో అప్లోడ్ చేయాలని సూచించారు. దీని వల్ల అతని పేరిట, మరో హాస్పిటల్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేయడానికి వీలుండదు. దీంతో ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేటుకు షిఫ్ట్ చేసే కేసులకు చెక్ పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.
బయోమెట్రిక్ హాజరుతో జీతాలు
ప్రభుత్వ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బందికి ఇకపై బయోమెట్రిక్ హాజరు ప్రకారమే జీతాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, నిమ్స్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించింది. త్వరలోనే అన్ని హాస్పిటళ్లకు ఈ విధానాన్ని విస్తరించబోతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి వచ్చాక, ఈ హాజరు ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి పెద్ద హాస్పిటళ్ల వరకూ అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లలో డాక్టర్లు అందుబాటులో ఉన్నరా, లేరా అనేది వీటి ద్వారా నిఘా పెట్టనున్నారు. డుమ్మా డాక్టర్లకు చెక్ పెట్టేందుకే ఈ విధానాలను తెస్తున్నారు