
భువనేశ్వర్: విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిసి ఒడిశాకు చెందిన చీఫ్ ఇంజినీర్ ఏం చేయాలో తోచక.. ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ అంతా కిటికీలోంచి బయటకు విసిరేశారు. 500 రూపాయల నోట్లన్నీ వర్షంలా పడుతుండటం గమనించి స్థానికులంతా షాకయ్యారు. అప్పటికే అధికారులు చేరుకుని డబ్బంతా స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్కు చెందిన వైకుంఠనాథ్ సారంగి గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు శుక్రవారం రెయిడ్స్ చేశారు.
ఆయనకు చెందిన ఏడు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తన ఇంటికి వచ్చిన విజిలెన్స్ అధికారులను చూడగానే సారంగి దాచిన డబ్బంతా కిటికీలోంచి బయటకు విసిరేశారు. ఇది గమనించిన ఆఫీసర్లు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆ నోట్ల కట్టలన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంగుల్ జిల్లాలో ఉన్న ఈ రెండంతస్తుల ఇంట్లోంచి రూ.1.1 కోట్లు, భువనేశ్వర్లోనే సారంగికి చెందిన మరో ఫ్లాట్ నుంచి రూ.కోటి కలిపి మొత్తం 2.1 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు.
లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్ అరెస్ట్
ఒడిశాకు చెందిన ఈడీ ఆఫీసర్ రఘువంశీని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మైనింగ్ బిజినెస్మన్ను కేసు నుంచి తప్పించేందుకు రఘువంశీ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడన్న ఆరోపణలున్నాయి. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన రఘువంశీ ఒడిశా కస్టమ్స్ అండ్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.