మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక .. రాజస్థాన్​లో కుల గణన : రాహుల్​ గాంధీ

మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక .. రాజస్థాన్​లో కుల గణన : రాహుల్​ గాంధీ

జైపూర్: రాజస్థాన్‌‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కుల గణన నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని దళితులు, బీసీలు తమ వాస్తవ సంఖ్యను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నందున కుల గణన అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఈమేరకు రాహుల్ ​బుధవారం రాజస్థాన్‌‌లోని ధోల్‌‌పూర్, భరత్‌‌పూర్‌‌లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకునేవారని, కుల గణన చేయాలని తాను డిమాండ్​ చేయగానే ఆయన మాట మార్చారని చెప్పారు. దేశంలో ఒకే ఒక కులం ఉందని, అదే పేదరికమని ఇప్పుడు చెబుతున్నారని రాహుల్​ విమర్శించారు. మోదీ, అదానీ, అమిత్ షా ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని ఆరోపించారు.

‘‘మోదీ ముందు నుంచి వస్తున్నారు.. టీవీల్లో కనిపిస్తూ హిందూ-ముస్లింల గురించి మాట్లాడి మీ దృష్టిని మళ్లిస్తుంటే అదానీ వెనుక నుంచి వచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నించాలని చూస్తే చేతిలో కర్రతో అమిత్​ షా మరోవైపు నుంచి చూస్తున్నాడు. ఇదీ మన దేశంలో ప్రభుత్వం నడుస్తున్న విధానం” అని రాహుల్ ​చెప్పారు. దేశానికి సేవ చేయాలనుకునే యువకుల కలలను అగ్నిపథ్​ ద్వారా మోదీ చెదరగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్​ఏంచేసినా పేదల కోసమే చేస్తుంది.. మోదీ సర్కారు మాత్రం అదానీ సహా ఇద్దరు  ముగ్గురు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుంది. అదానీ ప్రభుత్వం కావాలో, సామాన్యుల ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని రాహుల్​కోరారు. యూపీఏ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 లకు చేరిందని మోదీ గగ్గోలు పెట్టారని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని గుర్తుచేశారు. అదే సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200లకు చేరినా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని రాహుల్ ​గాంధీ విమర్శించారు.