
కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీలో నెలకొన్న విభేదాలు జాబ్ మేళా సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు సంబంధం లేకుండా ఆ పార్టీ మాజీ ఇంఛార్జి శశిధర్ రెడ్డి ఈనెల 25న మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు నివాసంలో రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో ఎక్కడా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఫోటో లేదు. కాగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుప్రీంగా ఉండగా ప్రస్తుతం కోదాడ లో ఎమ్మెల్యే కు సంబంధం లేకుండా సీనియర్ నాయకులు జాబ్ మేళా లు ఏర్పాటు చేయడం ఆ పార్టీ లో నెలకొన్న వర్గ విభేదాలకు అద్దం పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక నేటి నుండి చిలుకూరు మండలం బేతవోలులో జరుగుతున్న కనకదుర్గమ్మ జాతరలో కూడా పార్టీలోని రెండు వర్గాలు వేరువేరుగా సభలు ఏర్పాటు చేసి, కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి విభేదాలు మరింత ముదిరి పార్టీని పరాజయం దిశగా నడిపిస్తాయని కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.