
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల విచారణను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం (సెప్టెంబర్ 5) హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యక్తిగత పనుల మీద ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు వచ్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
కానీ, కాళేశ్వరం విచారణను తెలంగాణ సర్కార్ సీబీఐకి అప్పగించిన ఐదు రోజుల్లోనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ సూద్ వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వచ్చినట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. కాళేశ్వరం కేసు గురించి డిస్కస్ చేసేందుకు ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ టూర్ స్టేట్ పాలిటిక్స్లో.. ముఖ్యంగా గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన విషయం తెలిసిందే. నేషనల్డ్యామ్సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సీబీఐని కోరింది.
అందులో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించిన అన్ని నివేదికలను సీబీఐకి ఇచ్చింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి ఉన్న నిషేధాన్ని కూడా సడలించింది ప్రభుత్వం. కాళేశ్వరం కేసు విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో సీబీఐ రంగంలోకి దిగనుంది. ప్రభుత్వం సమర్పించిన నివేదికల ఆధారంగా కేసు నమోదు చేసి ఎంకైర్వీ స్టార్ట్ చేయనుంది సీబీఐ.