హైదరాబాద్, వెలుగు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ రిటైర్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన భార్య కొలుకూరి ప్రవలికను కూడా ఎఫ్ఐఆర్లో నిందితురాలిగా చేర్చింది. ఈ మేరకు సీబీఐ హైదరాబాద్ జోనల్ కార్యాలయం 15న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దుర్గాప్రసాద్ 2016లో సెంట్రల్ రోడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా చేరారు. 2022 సెప్టెంబర్ 16న డిప్యుటేషన్పై ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో డీజీఎం(టెక్నికల్)గా జాయిన్ అయ్యారు. అనంతరం ఖమ్మం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ డైరెక్టర్గా, ఆ తర్వాత వరంగల్ పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 2024 ఆగస్టు 20 నుంచి 2025 ఆగస్టు 19 వరకు వరంగల్ ఎన్హెచ్ఏఐ పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ సోదాల అనంతరం రూ.8.90 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించింది. ఆస్తుల పెరుగుదల, ఖర్చులు పోను రూ.1.03 కోట్లకు పైగా ఆస్తులు ఆదాయానికి మించినవిగా గుర్తించి ఆయనపై కేసు నమోదు చేసింది.
