ఫేక్​ సీబీఐ ఆఫీసర్కు బడా లీడర్లతో లింకులు

ఫేక్​ సీబీఐ ఆఫీసర్కు బడా లీడర్లతో లింకులు

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు అతడిని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని రోజులు శ్రీనివాసరావును తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దాదాపు గంటన్నర పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస రావు  ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో చాలా పెద్ద స్థానాలలో ఉన్న వారిని, బడా లీడర్లను  శ్రీనివాసరావుతో కలిపి విచారించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈక కేసుతో ముడిపడిన దాదాపు 1100 కాల్స్ డేటాను పరిశీలన చేస్తున్నామని పేర్కొంది. శ్రీనివాసరావుతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను డిసెంబరు 1న దాదాపు 8 గంటల పాటు సీబీఐ ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించింది. 

డిసెంబరు 1న ఏమైంది ?

నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) డిసెంబరు 1న (గురువారం) సీబీఐ విచారణకు హాజరయ్యారు. సాక్షులుగా హాజరైన వీళ్లిద్దరినీ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. ఒక ఐపీఎస్, ఇద్దరు సీఐలతో కూడిన సీబీఐ బృందం వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. వీళ్లిద్దరినీ వేర్వేరుగా, నిందితుడితో కలిపి విచారించి స్టేట్ మెంట్లు రికార్డు చేసింది. ముఖ్యంగా శ్రీనివాస్ తో ఉన్న సంబంధం ఏంటి? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. శ్రీనివాస్ ఫోన్​లో దొరికిన పలు ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల గురించి అడిగినట్లు సమాచారం. ఇటీవల మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాస్​ను ఎందుకు సన్మానించారని, గ్రానైట్ అసోసియేషన్ నుంచి విలువైన గిఫ్టులను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది.  శ్రీనివాస్ తమకు కేవలం మున్నురు కాపు బిడ్డగా, ఐపీఎస్ అధికారిగా మాత్రమే తెలుసునని మంత్రి గంగుల తెలిపారు. ఆయన దగ్గరున్న గోల్డ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. 

సీబీఐ శ్రీనివాస్​గా ఫేమస్..  

నకిలీ సీబీఐ ఆఫీసర్ కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న శ్రీనివాస్.. బెయిల్ పిటిషన్ వేయాలని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వైజాగ్​లోని ఆయన ఫ్రెండ్స్ గురువారం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్​కు వచ్చారు. ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీనివాస్ వైజాగ్ లోని సీబీఐ టౌన్​లో చాలా రోజులు రైస్ బిజినెస్ చేశాడు. అందుకే ఆయనను అందరూ సీబీఐ శ్రీనివాస్ అని పిలిచేవారు. పది రూపాయల వడ్డీకి వ్యాపారం చేసేవాడు. ఏడాదిన్నర కాలంగా వైజాగ్, ఢిల్లీ, హైదరాబాద్​కు తిరుగుతున్నాడు” అని వాళ్లు చెప్పారు. ఇంగ్లిష్​లో తన పేరు కూడా సరిగ్గా రాయలేని శ్రీనివాస్.. హిందీలో బాగా మాట్లాడతాడని తెలిపారు. గతంలో తమను వద్దిరాజు రవిచంద్ర దగ్గర దావత్​కు రమ్మని పిలిచాడని, కానీ తాము వెళ్లలేదని పేర్కొన్నారు.