లాక్డౌన్ తరువాత దొంగతనాలు పెరిగాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఇటీవల మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరి గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మధ్య ప్రదేశ్కి చెందిన రితురాజ్ సింగ్ ఈ చోరీలో ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. రాత్రిసమయంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు
మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ ముఠా ప్రొఫెషనల్ గ్యాంగ్ అని , మేడిపల్లి లో ఇల్లు అద్దెకు తీసుకొని ఈ ముఠా దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఈ గ్యాంగ్ పై మేడిపల్లి,మహేశ్వరం శంషాబాద్ పరిధిలో 14 కేసులు ఉన్నాయని, మధ్యప్రదేశ్ లో ఈ 26 కేసులు ఉన్నాయన్నారు. 2006 నుంచి ఈ ముఠా దొంగతనాలు చేస్తున్నదని చెప్పారు. నిందితుల నుంచి 17లక్షల 40 వేల విలువ చేసే 26 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, రెండు బైకులు, లక్ష 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు
వినాయక నిమజ్జనాల గురించి మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్ ప్రకారం ఏర్పాటు చేశామన్నారు సీపీ మహేశ్ భగవత్. కరోనా నిబంధనల కారణంగా గతంలో కంటే వినాయక విగ్రహాలు 30 శాతం తగ్గాయన్నారు. రాచకొండ పరిధిలో చెరువులు,కుంటల దగ్గర వినాయక నిమజ్జనం కు అన్ని ఏర్పాటు చేస్తున్నామని, సోషల్ డిస్టన్స్ పాటించేలా భారీ కేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ పెట్టుకొని ,శాంతి యుతం గా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.