
న్యూఢిల్లీ: ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై దండుదాడులు పెరిగిపోయానని, వాటిని నివారించేలా చర్యలు తీసుకోండంటూ భిన్న రంగాలకు చెందిన 49 మంది సెలబ్రిటీలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవాళ్లపై యాంటీ నేషనల్, అర్బన్ మావోయిస్టు అనే ముద్రలు వేయడం తగదని సూచించారు. దేశంలో దేవుడి పేరుతో దాడులు పెరిగాయని, ‘జై శ్రీరాం’ అనే మాట ఇప్పుడు హింసను రెచ్చగొట్టే నినాదంగా మారిందని లేఖలో సెలబ్రిటీలు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2016లో దళితులపై దండుదాడులకు సంబంధించి 840 కేసులు నమోదుకాగా, మెజార్టీ కేసుల్లో ఆధారాలు లేకపోవడంతో నిందితులు తప్పించుకున్నారన్నారు. ఈ తరహా దాడుల్ని ప్రధాని మోడీ గతంలోనే ఖండించినప్పటికీ, వాటిని నివారించే దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పీఎంకు లేఖ రాసిన ప్రముఖుల్లో శ్యాం బెనగల్, అపర్ణా సేన్, రామచంద్ర గుహ, సౌమిత్రో ఛటర్జీ, నటి రేవతి, వినాయక్ సేన్, ఆశిష్ నందీ తదితరులున్నారు.