హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సోమవారం (జూన్ 8) సాయంత్రం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్లాంట్లోని SMS-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలిస్తున్న సమయంలో మోల్టెన్ మెటల్ లాడెల్కు సంబంధించిన బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ మొత్తంలో లిక్విడ్ ఉక్కు ప్రమాదవశాత్తూ.. అక్కడ డ్యూటీలో ఉన్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మందికి పైగా మృతి చెందారు. వేడి వేడి ఉక్కు మీద పడటంతో మృతదేహాలు కాలి బూడిదైపోయినట్లు తెలిసింది.
మరికొందరు గాయపడగా.. అధికారులు వెంటనే ప్లాంట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అత్యవసరంగా అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా అనే కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు.
►ALSO READ | వైజాగ్ స్టీల్ ప్లాంట్లో హృదయ విదారక దృశ్యాలు.. వేడి వేడి ఉక్కు మీద పడి 8 మంది సజీవ దహనం
విశాఖ స్టీల్ప్లాంట్లో హృదయ విదాకర దృశ్యాలు కనిపించాయి. లిక్విడ్ స్టీల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మరుగుతున్న స్టీల్ పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనం అయినట్లు తెలిసింది. నలుగురు మృతదేహాలను గుర్తించారు. లిక్విడ్ స్టీల్తో బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో.. లాడల్ బ్లాస్ట్ అవడం ఇదే ఫస్ట్ టైమ్ అని కార్మిక సంఘాలు చెప్పుకొచ్చాయి. ప్రమాద సమయంలో 150 టన్నుల లిక్విడ్ స్టీల్ మెటల్ ఉందని కార్మికులు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హోం మంత్రి ప్రమాద స్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.
