 
                                    - అజారుద్దీన్ని కేబినెట్లోకి తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపాటు
- జిష్ణుదేవ్ వర్మ ఎవరి ఒత్తిళ్లకు లొంగరని అనుకుంటున్నా..
- మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప క్రికెటర్ అజారుద్దీన్కు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.
అజార్తో ప్రమాణస్వీకారం చేయించకుండా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మపై బీజేపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. కానీ గవర్నర్ గొప్ప వ్యక్తి అని, ఆయన అలాంటి ఒత్తిళ్లకు లొంగరనే నమ్మకం తనకుందని చెప్పారు. అజార్కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని అన్నారు.
రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ జిల్లా శ్రీ కరుణ్పుర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ను అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నదని గుర్తు చేశారు. ఉప ఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకొని, ఇక్కడ మాత్రం అజార్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం బీజేపీ ద్వంద ప్రమాణాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
మైనార్టీ అనే ద్వేషంతోనే..
మైనార్టీ అనే ద్వేషంతోనే అజార్ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటున్నదని భట్టి విక్రమార్క విమర్శించారు. ఉప ఎన్నిక జరిగేది కేవలం జూబ్లీహిల్స్లో మాత్రమేనని, అజార్ ప్రమాణస్వీకారం బయట జరుగుతున్నదని అన్నారు. ఆయన అక్కడ పోటీ చేయడం లేదని, పైగా ఆయనను ఇప్పటికే ఎమ్మెల్సీగా ప్రకటించామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత చెప్పారని గుర్తు చేశారు.
ఈ ఉప ఎన్నికల్లో ఎలాగో గెలిచేది లేదని బీజేపీకి తెలుసని, అందుకే బీఆర్ఎస్ కు లాభం చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దించిందని ఆరోపించారు. పైగా చాలా ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించి పరోక్షంగా బీఆర్ఎస్ కు మేలుజరిగేలా తన వంతు ప్రయత్నాలు చేసిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సమాజంలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అజార్ ను మంత్రి కాకుండా బీజేపీ చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.
తుఫాన్ బాధితులకు న్యాయం చేస్తం
మొంథా తుఫాన్పై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కేబినెట్, సీఎస్తోపాటు యంత్రాంగం మొత్తం 46 గంటల ముందే అప్రమత్తమైందని భట్టి విక్రమార్క తెలిపారు. తాము ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని చెప్పారు. రాష్ట్ర మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ప్రణాళిక, నిర్ణయాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయని చెప్పారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవీయకోణంతో ఆలోచన చేసి, ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

 
         
                     
                     
                    