మంచిర్యాల మెడికల్ కాలేజీలో వంద సీట్లకు కేంద్రం అనుమతి

మంచిర్యాల మెడికల్ కాలేజీలో వంద సీట్లకు కేంద్రం అనుమతి
  • ఈ ఏడాదిలో 8 కాలేజీలకు పర్మిషన్
  • వాటిలో 1,150 సీట్లు అందుబాటులోకి

హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద సీట్లకు అనుమతి ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌‌ (ఎన్ఎంసీ) ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాలేజీ ప్రిన్సిపాల్‌‌కు, రాష్ట్ర సర్కార్‌‌‌‌కు శుక్రవారం లేఖలు పంపింది. ఇప్పటికే  సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఎన్‌‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 150 సీట్లు వచ్చాయి. మంచిర్యాల్ కాలేజీలో  గైడ్‌‌లైన్స్ ప్రకారం సౌలతులు లేవని అనుమతి ఇచ్చేందుకు ఎన్‌‌ఎంసీ నిరాకరించింది.

'దీంతో  కేంద్ర వైద్య శాఖకు రాష్ట్ర సర్కారు అప్పీల్‌‌ చేసింది. సౌలతులు కల్పిస్తామని పర్మిషన్ ఇప్పించాలని కోరింది. ఈ అప్పీల్‌‌పై ఈనెల 17వ తేదీన ఢిల్లీలో విచారణ జరిగింది. డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు ఇచ్చిన ప్రజంటేషన్‌‌తో సంతృప్తి చెందిన వైద్య శాఖ.. కాలేజీకి పర్మిషన్ శుక్రవారం ఎన్‌‌ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 150 సీట్లకు పర్మిషన్ కోరగా.. వంద సీట్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ ఏడాదిలోనే 8 కాలేజీలకు అనుమతి లభించగా, వీటిలో 1150  సీట్లు స్టూడెంట్లకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ కోటా కౌన్సెలింగ్‌‌లో సీట్లు పొందిన విద్యార్థులు కొత్త కాలేజీల్లో అడ్మిషన్ కూడా తీసుకుంటున్నారు.