
Charges on UPI: ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే దీనికింత అనుమతించబడిన మెుత్తం వరకు రోజూ ప్రజలు ఎలాంటి అంతరాయం లేకుండా చెల్లింపులు నిర్వహించుకోవచ్చు. అయితే చాలా కాలం నుంచి ఈ సేవలను ఉచితంగా ఉండటం కంటే ఛార్జీలను వసూలు చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను కూడా మానిటైజ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తాజా రిపోర్ట్ చెబుతోంది.
ప్రస్తుతం ఉన్న యూపీఐ చెల్లింపుల్లో పెద్ద మెుత్తం చెల్లింపులను మానిటైజ్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇందుకోసం వాటిపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(MDR)ను అమలు చేయాలని చూస్తున్నట్లు నివేదించబడింది. దీనికింద రూ.3వేల కంటే విలువైన చెల్లింపులపై MDR రేట్లను అమలు చేయాలని ప్రతిపాదించబడింది. ఇక్కడ మర్చంట్ టర్నోవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సమాచారం.
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన మంత్రికి యూపీఐ చెల్లింపులపై కొనసాగుతున్న సున్నా మర్చంట్ డిస్కౌంట్ రేటు పై పునః సమీక్షించాలని కోరిన తర్వాత తాజా ఆలోచన వచ్చింది. ప్రస్తుతం భారత రోజువారీ యూపీఐ చెల్లింపుల సంఖ్య ప్రపంచ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలను అధిగమించే స్థాయిలకు చేరుకుంటున్న వేళ కొత్త ఛార్జీల డిమాండ్ తెరమీదకు వచ్చింది. అయితే ఈ ఛార్జీలను వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. వాస్తవానికి డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై కూడా ఈ ఎండీఆర్ రేటు ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో చాలా మంది వ్యాపారులు తాము చెల్లించాల్సిన మర్చంట్ డిస్కౌంట్ రేటును కూడా తమ కస్టమర్ల నుంచే వసూలు చేయటం సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది. కేవలం పెద్దపెద్ద వ్యాపారులు మినహా చివరికి ఆసుపత్రుల్లో సైతం 2 శాతం అదనపు ఎండీఆర్ ఛార్జీలను క్రెడిట్ కార్డు చెల్లింపులపై ప్రజలే చెల్లించుకుంటున్నారు. అయితే కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కూడా ఈ ఎండీఆర్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెడితే ఇది ఖచ్చితంగా ప్రజలను డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను ఉపయోగించకుండా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసలు MDR రేటు అంటే ఏంటి..?
ప్రస్తుతం దేశంలో MDR ఛార్జీలను వ్యాపారుల నుంచి పేమెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. కొన్ని నెలల కిందట భారత ప్రభుత్వం రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులపై కూడా మర్చంట్ డిస్కౌంట్ రేటును వసూలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పేమెంట్స్ సమయంలో కొంత శాతాన్ని పేమెంట్ సంస్థలు ఫీజుగా వసూలు చేస్తుంటాయి. దీనిని చెల్లింపు వ్యవస్థలోని సంస్థల మధ్య పంపిణీ జరుగుతుంది. వాస్తవానికి దీనిని వ్యాపారులే భరించాల్సి ఉన్నప్పటికీ కొందరు మాత్రం తమ కస్టమర్ల నుంచే దీనిని కూడా వసూలు చేస్తున్నారు.