242 బెట్టింగ్ వెబ్ సైట్లు బ్లాక్..ఇప్పటివరకూ 7,800 ప్లాట్ ఫామ్స్ పై కేంద్రం నిషేధం

242 బెట్టింగ్ వెబ్ సైట్లు బ్లాక్..ఇప్పటివరకూ 7,800 ప్లాట్ ఫామ్స్ పై కేంద్రం నిషేధం


న్యూఢిల్లీ: ఆన్​లైన్​లో అక్రమంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న మరో 242 వెబ్ సైట్ల లింకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన ఆన్​లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం.. ఇప్పటివరకూ 7,800 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్ సైట్లను నిషేధించినట్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆన్ లైన్ యూజర్లు, ప్రధానంగా యువతను ఆర్థిక దోపిడీ నుంచి కాపాడటం కోసం అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ ఫామ్స్​పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపాయి. 

కాగా, ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్​ఆన్​లైన్ గేమింగ్ బిల్లు, 2025’ పార్లమెంట్​లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గతేడాది ఆగస్టులో ఆమోదం తెలిపారు. ఈ బిల్లు 2025, అక్టోబర్ 1 నుంచి చట్ట రూపం దాల్చింది. ఆన్​లైన్​లో ఈ–స్పోర్ట్స్, సోషల్ గేమ్స్​ను ప్రోత్సహించే ఈ చట్టం.. డబ్బు ఆధారంగా నడిచే గేమ్స్​ను మాత్రం నిషేధించింది. ఇలాంటి బెట్టింగ్​ యాప్స్​ను ప్రమోట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు నడపడంపై కూడా బ్యాన్ విధించింది. 

డబ్బు ఆధారంగా నడిచే ఆన్​లైన్ గేమ్స్ ఆడే యూజర్లపై పెనాల్టీలు వేయకుండా.. వాటిని నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లు, అడ్వర్టైజర్లు, ప్రమోటర్లు, నిధులు సమకూర్చేవారిపైనే కేంద్రం ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటోంది.