
చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ఎంఓఆర్డీ) కేంద్ర బృందం సభ్యులు రాకేశ్ కుమార్, అండర్ సెక్రటరీ( బడ్జెట్) అమిత్ కుమార్, సెక్షన్ ఆఫీసర్లు సోమవారం చండ్రుగొండ మండలంలో పర్యటించారు. నాలుగు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మొదటిరోజు బృంద సభ్యులు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను బృంద సభ్యులకు వివరించారు.
అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని పరిశీలించారు. డీఆర్డీఏ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. చండుగొండ మండలం తిప్పనపల్లి , రావికంపాడు గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి ఉపాధి హామీ పథకం వేతన దారులు, స్వయం సహాయక సంఘ మహిళలు, పెన్షనర్లతో మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇంట్లో పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఏర్పాటుచేసిన ఊరగాయ తయారీ యూనిట్ను పరిశీలించారు.
నర్సరీ, అవెన్యూ తోటలు, ప్రాథమిక పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కిచెన్ షెడ్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, సీఈవో నాగలక్ష్మి, అడిషనల్ పిడి రవి, పీఆర్ డీఈ సైదులు రెడ్డి, ఎంపీడీవో అశోక్, ఎంపీవో ఖాన్, ఏపీఎం సంతోష్, ఇతర మండల అధికారులు పాల్గొన్నా రు.