
బషీర్ బాగ్, వెలుగు: ఫారిన్ సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనోహర్ సింగ్ ఆరేండ్ల కిందట సిటీకి వచ్చి అఫ్జల్గంజ్ ఏరియాలో ఉంటున్నాడు. సిగరెట్ లైటర్స్ మార్కెటింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఫారిన్ సిగరెట్లు అమ్మే ఢిల్లీకి చెందిన రోహిత్ శర్మతో మనోహర్కు పరిచయం ఏర్పడింది. ఈజీ మనీ కోసం మనోహర్ సిటీలో వాటిని అమ్మేందుకు స్కెచ్ వేశాడు.
రోహిత్ నుంచి ఫారిన్ సిగరెట్లను కొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ పోర్ట్ చేయించుకుని ఇక్కడ తెలిసిన వాళ్లకు అమ్మడం మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ పోలీసులు అఫ్జల్గంజ్ పరిధి అశోక్నగర్లోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.3 లక్షల 5 వేల విలువైన 170 బాక్సుల ఫారిన్ సిగరెట్లను సీజ్ చేశారు.