కరోనా మళ్లీ వచ్చింది..జర జాగ్రత్త

కరోనా మళ్లీ వచ్చింది..జర జాగ్రత్త
  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు
  • ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం, కేరళలో కొత్త వేరియంట్​కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ మన దేశంలో ఇప్పుడు బయటపడింది, ప్రస్తుతం 38 దేశాల్లో ఈ జేఎన్.1 సబ్ వేరియంట్​కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. అయితే, రాబోయేది పండగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్​ పరీక్షలను పెంచాలని, కొత్త వేరియంట్​ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్​ పంత్​ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి క్రమాన్ని నిశితంగా పరిశీలించాలని, కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా కొత్త వేరియంట్​పై ప్రజలలో అవగాహన పెంచాలని చెప్పారు. కాగా, కరోనా కేసులు సహా ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ నెల 20న వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. 

కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1,828 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8న కేరళలో  కొత్త వేరియంట్​(జేఎన్.1) కేసు నమోదు కాగా.. ఆదివారం ఓ బాధితుడు మరణించాడని వివరించారు. అయితే, ఈ వేరియంట్ కేసులు​భారత్​ తో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు మరింత అలర్ట్​గా ఉండాలని సూచించింది.