- 2024 లో మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్న బ్రోకరేజ్ కంపెనీలు
- ఐటీ, మెటల్స్కు దూరం
న్యూఢిల్లీ: సిటీ, బెర్న్స్టెయిన్, జెఫరీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ కంపెనీలు ఈ ఏడాది ఏ సెక్టార్లపై ఫోకస్ పెట్టాలో వివరించాయి. ఇప్పటికే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పెరగడంతో లార్జ్ క్యాప్ షేర్ల వైపు ఇవి మొగ్గు చూపుతున్నాయి.
ఈ బ్రోకరేజ్ కంపెనీల రికమండేషన్స్ ఇలా..
1. జెఫరీస్..
ఈ ఏడాది దేశ మార్కెట్లోకి భారీగా విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని జెఫరీస్ అంచనా వేస్తోంది. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. వీటితో పాటు సైక్లికల్ (సీజన్ బట్టి పెరిగేవి), పవర్, టెలికం, ఇండస్ట్రియల్స్, రియల్ ఎస్టేట్ సెక్టార్లపై పాజిటివ్గా ఉంది. ఐటీ షేర్ల పెర్ఫార్మెన్స్ ఈ ఏడాది బాగోకపోవచ్చని పేర్కొంది. దీంతో పాటు కన్జూమర్, ఎనర్జీ సెక్టార్లకు అండర్వెయిట్ (పడొచ్చు) రేటింగ్ ఇచ్చింది. బ్యాంక్లకు ఓవర్వెయిట్ (ఎక్కువగా పెరుగుతాయని) రేటింగ్ ఇచ్చింది. మరోవైపు లార్సెన్ అండ్ టుబ్రో, అదానీ పోర్ట్స్పై తన వెయిటేజ్ తగ్గించింది. అంటే ఈ షేర్లు మరీ ఎక్కువగా పెరగవని ఈ కంపెనీ భావిస్తోంది. లార్జ్ క్యాప్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మాక్రోటెక్ డెవలపర్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, కజారియా సిరామిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చింది.
2. బెర్న్స్టెయిన్..
స్మాల్, మిడ్ క్యాప్ షేర్లపై రేటింగ్ను బెర్న్స్టెయిన్ డౌన్గ్రేడ్ చేసింది. చాలా కంపెనీల వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయని ఈ కంపెనీ పేర్కొంది. ఫైనాన్షియల్ షేర్లపై మాత్రం ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. టెక్ సెక్టార్పై మిశ్రమంగా స్పందించింది. ఇందులోని ఐటీ సర్వీస్లపై రేటింగ్ను ఓవర్వెయిట్ (కొనొచ్చు) కు అప్గ్రేడ్ చేసింది. అదే కన్జూమర్ టెక్ షేర్లను డౌన్గ్రేడ్ చేసింది. వీటితో పాటు టెలికం షేర్లకు ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. మెటల్స్ మాత్రం పెద్దగా పెరగకపోవచ్చని తెలిపింది. రియల్ ఎస్టేట్, సిమెంట్ సెక్టార్లపై రేటింగ్ను బెర్న్స్టెయిన్ డౌన్గ్రేడ్ చేసి ఈక్వల్ వెయిట్కు (అంతగా పెరగవని) తగ్గించింది.
3. సిటీ
బ్రోకరేజ్ కంపెనీ సిటీ మిడ్ క్యాప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతుందని పేర్కొంది. బ్రాడ్ మార్కెట్లోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు భారీగా వస్తాయని తెలిపింది. లార్జ్ క్యాప్ షేర్లతో రిస్క్కు తగ్గ రిటర్న్ ఉంటుందని పేర్కొంది. పీఎస్యూ యుటిలిటీస్, డిఫెన్స్, ఇండస్ట్రియల్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ షేర్లకు ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. కానీ, ఈ సెక్టార్లలో కూడా లార్జ్ క్యాప్ షేర్ల వైపే కంపెనీ మొగ్గు చూపింది. మరోవైపు మెటల్స్, ఐటీ షేర్లకు అండర్వెయిట్ (పడొచ్చని) రేటింగ్ ఇచ్చింది. ఈ ఏడాది కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, దేవయాని ఇంటర్నేషనల్, ఇండస్ టవర్స్, ఎండ్యురెన్స్ టెక్ షేర్లను రికమండ్ చేసింది.
4. మోతీలాల్ ఓస్వాల్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హీరో మోటో కార్ప్, దాల్మియా భారత్ , కోల్ ఇండియా, కజారియా సిరామిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని బ్రోకరేజ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ సలహా ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లు ఈ ఏడాది కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయని అంచనా వేస్తోంది. మాక్రో ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, ఫండమెంటల్స్ బాగున్నాయని చెబుతోంది. తాజాగా మార్కెట్ పెరిగినప్పటికీ మార్కెట్ వాల్యుయేషన్ ఇంకా గత 10 ఏళ్ల సగటు కంటే దిగువన ఉందని పేర్కొంది. ఓఎన్జీసీ, సీమన్స్, పీఎన్బీ హౌసింగ్, లెమన్ట్రీ, సన్టెక్ రియల్టీ లిమిటెడ్ షేర్లపై కూడా ఈ కంపెనీ సానుకూలంగా ఉంది.