అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బాబు కౌంటర్

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బాబు కౌంటర్

తమకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్త కాదని, ఇంతకు ముందు కూడా మూడు సార్లు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నామన్నారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. గురువారం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అభినందనలు తెలిపే సమయంలో మైక్ సరిగా పనిచేయలేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు  మాట సరిగా రావడం లేదంటూ ఎద్దేవా చేశారు.  ఆ వ్యాఖ్యలకు స్పందించిన బాబు..” నా వాయిస్ తగ్గలేదు.. మైకులు సరిగా పెట్టలేదేమో.. మా హయాంలో బాగానే పని చేసిన మైకులు.. మీ ఆధ్వర్యంలో వాయిస్ రావడం లేదు కాబట్టి కారణం మీరే ఆలోచించుకోవాలని” అన్నారు. “మీరు ఎలాంటి బాధ పడక్కర్లేదు. నా వాయిస్ తగ్గదు, పోరాటం కూడా తగ్గదని” చిరునవ్వుతో బదులిచ్చారు. ఆయన మాటలకు సీఎం జగన్ కూడా ముసిముసి నవ్వులు నవ్వారు.

కాంట్రవర్సీకి ఇది సమయం కాదన్న చంద్రబాబు.. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన స్పీకర్ తమ్మినేని సీతారాం కు అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష హోదాలో స్పీకర్ కు అన్ని విధాల సహకరిస్తామని అన్నారు.